‘ధర్మస్థల నియోజకవర్గం’ నుండి మొదటి పాటను లాంచ్ చేసిన క్రిష్, చంద్రబోస్

నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా శేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ సినిమా నుండి మొదటి పాట “ధర్మో రక్షతి రక్షితః” ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరియు ఆస్కార్ విజేత, గేయ రచయిత చంద్రబోస్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

చిత్ర కథాంశానికి, స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ పాటను రూపొందించామని, ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ పాట విడుదల కార్యక్రమానికి దర్శకుడు జై జ్ఞానప్రభ తోట, నిర్మాత మేరుమ్ భాస్కర్, సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ హనుమతో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు జై జ్ఞానప్రభ తోట మాట్లాడుతూ, క్రిష్ గారి చేతుల మీదుగా తమ సినిమాలోని మొదటి పాట విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, సినిమా ప్రయాణంలో ఎంతో ప్రోత్సాహం అందించిన చంద్రబోస్‌ గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ధర్మస్థల నియోజకవరం’ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుందని, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మూవింగ్ డ్రీమ్స్ పతాకంపై మేరుమ్ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞానప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చంద్రబోస్ సాహిత్యం అందించగా, మహావీర్ ఏలేందర్ సంగీతం సమకూర్చారు. సాయి చరణ్ ఈ పాటను ఆలపించారు. వెంకట్ హనుమ సినిమాటోగ్రఫీ, సాయి బాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ చిత్రంలో నటరాజ్, రాచ్యాన కొక్కుర, సుమన్, సాయి కుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, శివకుమార్ రామచంద్రవరపు, వితికా శేరు, వరుణ్ సందేశ్, కస్తూరి, హారిక, కాలకేయ ప్రభాకర్, షఫీ, ఛత్రపతి శేఖర్, ఐడ్రీమ్ అంజలి మరియు సత్య ప్రకాష్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. త్వరలోనే సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

Added by

Telugu Lyrics

SHARE